ముద్ర న్యూస్ బ్యూరో, హైదరాబాద్: సీనియర్ పాత్రికేయుడు, ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమితులయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం రాత్రి రాత్రి ఈ మేరకు నియామకపు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రభ, టీవీ9 వంటి మీడియా సంస్థలలో సుదీర్ఘకాలం పనిచేసిన అలపాటి సురేష్ కుమార్ రాజకీయ విశ్లేషకుడిగా, రచయితగా విశేషమైన గుర్తింపు పొందారు. ఐజేయూ ఆంగ్ల మాసపత్రిక స్కైబ్స్ న్యూస్ కు ఆయన ఎడిటర్ గా ఉన్నారు. హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలి స్ట్స్ (హెచ్ యూ జే), హైదరాబాద్ ప్రెస్ క్ల బ్ కు ఆయన గతంలో అధ్యక్షుడిగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పాలన పై సురేష్ కుమార్ రాసిన ‘ విధ్వంసం ‘ పుస్తకం విశేషమైన ప్రాచుర్యం పొందింది. ఆస్క్ పేరిట ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలపై లోతైన విశ్లేషణలతో ఆయన చేస్తున్న వీడియోలు కూడా ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి.
సురేష్ కుమార్ నియామకం పట్ల ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కే రామ్ నారాయణ, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు కే సత్యనారాయణ, నగునూరి శేఖర్, ముద్ర దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఎలిమినేటి ఇంద్రారెడ్డి, టీయూడబ్ల్యూజే కార్యదర్శి కే శ్రీకాంత్ రెడ్డి తదితరులు సురేష్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు.