- భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు.
- అధికారులు ఏ లోటు రాకుండా చూసుకోవాలి.
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేపట్టామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణకుమార్ పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం విప్ లక్ష్మణ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయంలో చేపట్టిన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్వామి వారి దర్శనం త్వర త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వాహనాల పార్కింగ్ వద్ద పోలీసు అధికారులు వాహనదారులు ఇబ్బందులు పడకుండా చూడాలని పేర్కొన్నారు. మార్చి 10 నుంచి మార్చి 22 వరకు లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచియే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారని తెలిపారు. వారికి అన్ని రకాలుగా అధికారులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు.భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని,ఎక్కడికి అక్కడ పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ పనులు చేపట్టాలని, ఆలయం సుందరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
స్వామివారి కళ్యాణం సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు,తలంబ్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన సత్రాన్ని విప్ లక్ష్మణ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల డిఎస్పి రఘు చందర్, తహసిల్దార్ కృష్ణ చైతన్య, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.