- ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిన వదిలిపెట్టం.
- కోర్టు తీర్పులతో కాలం వెళ్ళదీస్తున్నారు.
- వాటిపై ఇరు పక్షాలతో సమావేశమవుతాం.
- ప్రజావాణీ ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన.
ముద్ర, తెలంగాణ బ్యూరో : భూముల రికార్డులన్నీ పరిశీలించి, ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసిన సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రజావాణి ఫిర్యాదులపై బుధవారం పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటన కమిషనర్ రంగనాథ్ చేశారు.పోచారం మున్సిపాలిటీలో సంస్కృతి టౌన్ షిప్ తో పాటు ఏకశిలా నగర్లో ఫిర్యాదులను పరిశీలించిన ఆయన పరిశీలించారు. సంస్కృతి టౌన్షిప్లో 100 ఫీట్ల రహదారికి అడ్డంగా స్థల యజమానులు పెట్టిన గేట్లను ఆయన తెరిపించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ల రహదారి కి మార్కింగ్ చేసి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. పోచారం మున్సిపాలిటీ, కొరెముల గ్రామంలో 147 ఎకరాలలో ఏకశిలానగర్ లే ఔట్ను 1985వ సంవత్సరం వేశారు. 2006లో అందులోని 47 ఎకరాల మేర వ్యవసాయ భూమిగా లే ఔట్ ను మార్చేశారన్న ఫిర్యాదు మేరకు కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. కోర్టు తీర్పులు తమకు అనుకూలంగా ఉన్నా యిల్లు కట్టుకొనివ్వడం లేదని కమిషనర్ కు ప్లాట్ యజమానులు ఫిర్యాదు చేసారు. ఇరుపక్షాలను పిలిచి అన్ని రికార్డులను పరిశీలిస్తామని కమిషనర్ రంగనాథ్ వారికి హామీ యిచ్చారు. వచ్చేవారం సమావేశాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం నెక్నంపూర్లో ప్రధాన రహదారి నిర్మాణానికి ఉన్న ఆటంకాలను కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దాదాపు 20 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా, ఆ భూమి తమదే అని స్థానికులు క్లెయిమ్ చేయడమే కాకుండా ఆ స్థలంలోంచి రోడ్డు కూడా వేయనీయకుండా అడ్డుకోవడాన్ని పరిశీలించారు.హైటెన్షన్ కరెంట్ వైరులు కింద నిర్మిస్తున్న రోడ్డుకు ఆటంకాలు కల్పించవద్దని కమిషనర్ సూచించారు. వచ్చే వారం సమావేశం నిర్వహించి అన్ని పత్రాలను పరిశీలిస్తామని అభ్యంతరాలు ఉన్నవారిని పిలుస్తామన్నారు. తర్వాత గచ్చిబౌలి లోని జనార్ధన హిల్స్ వద్ద వరద కాలువ పనులతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు పరిశీలించారు.