ఆ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం
కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం
ముద్ర, నాగర్ కర్నూల్ :
అక్రమంగా సంపాదించిన రూ. వేల కోట్ల డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ రెండొందల యూట్యూబ్ చానెళ్లు కొనుగోలు చేసిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ఆ ఛానెళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వీటిలో ప్రసారమవుతున్న వార్తలను ప్రజలు నమ్మే అవకాశం లేకపోలేదన్నారు. సోషల్ మీడియాను కూడా విరివిగా వినియోగించుకున్న బీఆర్ఎస్.. ప్రభుత్వంపై బురదజల్లుతోందని ఆరోపించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన మాట్లాడారు. దేశంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. పదవుల వెంట వెళ్లోద్దని, పదవులే మీ వెంట వస్తాయని మంత్రి కార్యకర్తలకు సూచించారు. మంత్రాలకు చింతకాయలు రాలవని గుర్తించాలని, కూర్చున్న వద్ద నుంచే మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకోరాదని, ఫీల్డ్ లోకి వెళ్లి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2029 లో కేంద్రంలో రాహుల్ ప్రధాని కావాలన్నా, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావాలన్నా కార్యకర్తల పాత్ర ముఖ్యమన్నారు. పార్టీని బూత్ లెవెల్ నుంచి బలోపేతం చేయాలన్నారు. ప్రతి బూత్ లెవెల్ కార్యకర్త రోజుకు గంట సేపు కేటాయించి ప్రజల సమస్యలు విని, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.