- మరో నిందితుడు ప్రణీత్ రావుకు దక్కని బెయిల్
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు మాజీ డీసీసీ రాధా కిషన్, మాజీ అదనపు ఎస్పీ భుజంగరావులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు నిందితులు లక్ష రూపాయలతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అలాగే పాస్పోర్టులు సమర్పించాలని సూచించింది. ట్యాపింగ్ కేసులో విచారణకు సహకరించాలని ఆదేశించింది. తాజాగా రాధాకిషన్, భుజంగరావుకు బెయిల్ మంజూరు చేయడంతో ఈ కేసులో ఉన్న ప్రణీత్ రావు మత్రమే ప్రస్తుతం జైలులో ఉన్నారు. మిగతా నిందితులందరికీ బెయిలు మంజూరైంది. అలాగే ఈ కేసులోని మరో నిందితుడు, మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్నకు కూడా సుప్రీంకోర్టు ఈనెల 28న బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్ అరెస్ట్ చేసింది. దీంతో 10 నెలలుగా జైలులో ఉన్న తిరుపతన్న బెయిల్పై విడుదలయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయన తరపు న్యాయవాదులు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్ దాఖలు చేశారు. అనంతరం బెయిల్ ఆర్డర్ను చంచల్గూడ జైలు అధికారులకు అందించారు. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు మాత్రం బెయిల్ లభించలేదు. ప్రస్తుతం ప్రణీత్ రావు చంచలగూడ జైలులోనే ఉన్నాడు. ఆయన తరపు న్యాయవాదులు సమర్పించిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు పలుమార్లు తిరస్కరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, ఆరో నిందితుడిగా ఉన్న ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు. ప్రభాకర్రావు, శ్రవణ్రావును మన దేశానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.