- కేసీఆర్, కేటీఆర్,జగదీశ్వర్ రెడ్డి త్వరలోనే జైలుకు
- వారి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఉదారంగా వ్యవహరిస్తున్నారు
- ఆయన స్ధానంలో నేనుంటే వారిని ఎప్పుడో జైలుకు పంపేవాడిని
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : రానున్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. ఆ ముగ్గురి విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఆ స్థానంలో తనే ఉంటే ఆ ముగ్గురిని ఏనాడో జైల్లో వేసే వాడినని వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పక్షపాత చర్యలకు పాల్పడిందన్నారు. ప్రతిపక్షాలను పూర్తిగా క్షీణింపజేసే కుట్రలకు తెరతీసిన ఆ పార్టీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలపాలుచేసి తమ పార్టీలోకి చేరుస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాసిందని విమర్శించారు.
ప్రతిపక్షాలను కూలగొట్టి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంలో బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందన్నారు. తమ ప్రభుత్వానికి పచ్చ జెండా చూపిన ప్రజలు ఇప్పుడు ఆ కుట్రలపై ప్రశ్నిస్తారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని,వారికి ప్రజలు సమాధానం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడటం లేదని పునరుద్ఘాటించారు. మరోవైపు.. రైతు భరోసా పథకం ప్రారంభించడంలో తమ ప్రభుత్వం నిబద్ధత చూపుతుంటే, కేటీఆర్ తన స్థాయిని దిగజార్చి అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.