Take a fresh look at your lifestyle.

రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ

  • రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని ఎస్.ఆర్.ఆర్. గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి మంజూరైన 5,630 కొత్త తెల్ల రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను అందజేస్తున్నదని సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం అందించి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించి, మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ప్రభుత్వ దృడ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఎన్నో కార్యక్రమాలు, అభివృధ్ధి పనులు చేపడుతున్నదని ఆన్నారు.రేషన్ కార్డులలో పేర్లు నమోదు కాని వారు నమోదు చేయించుకోవాలని, రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆన్నారు.10 సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల కల ఈ రోజు నెరవేరిందని, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, వీటన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేషన్ కార్డులు రానివారు ఇప్పుడు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రభుత్వం వెంటనే వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం కొత్త కార్డు రాని వారు ఇబ్బందులు పడాల్సిన పని లేదని, రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వీలు ఉంటుందని, ఇది కాకుండా ప్రజాపాలనలోనూ ధరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మీ వివరాలను పరిశీలించి.. అర్హత ఉంటే కార్డును వెంటనే మంజూరు చేస్తారు. అంతేకాకుండా… కుటుంబ సభ్యుల పేర్లు జోడింపు ప్రక్రియ కూడా వేగంగా చేస్తున్నారని, ప్రభుత్వం రేషన్ కార్డుల ప్రక్రియ పై దృష్టి సారించింది. ప్రజాపాలన, గ్రామసభలతో పాటు మీ సేవ కేంద్రాలలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. కొత్తగా తీసుకుని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు అర్హులుగా నిర్ణయించింది. ముఖ్యంగా 500 రూపాయలకు వంట గ్యాస్ పథకాన్ని అమలు చేయడంతో పాటు గృహలక్ష్మి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయనున్నది. రేషన్ కార్డులు పొందిన వెంటనే వీరు సంబంధించిన మున్సిపల్, మండల పరిషత్ కార్యాలయాలలో దరఖాస్తులు చేసుకునే అవకాశం కల్పించింది. దాంతో వెంటనే ఆ సంక్షేమ పథకాలు తెల్ల రేషన్ కార్డులు పొందిన కొత్త వారికి కూడా వర్తించనున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.ఎస్. లత, ఆర్డీఓ మధు సుధన్, సివిల్ సప్లై అధికారి జితేందర్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.