- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అటవీ సంరక్షణపై సుప్రీంకోర్టు స్టే గొప్ప విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.ఆర్. గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలి అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలపై స్టే విధిస్తూ చారిత్రాత్మక ఉత్తర్వులు ఇచ్చినందుకు బీఆర్ఎస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.సుప్రీంకోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డి నియంతృత్వానికి గట్టి సమాధానమని అన్నారు.పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి వేధించినా, అబద్ధపు కేసులతో బెదిరించినప్పటికీ విద్యార్థులు తమ ధైర్యాన్ని కోల్పోలేదని అన్నారు. వారి నిబద్ధతకు, ఆత్మస్థైర్యానికి, త్యాగానికి గర్వపడాల్సిన సమయం ఇది అని ఎమ్మెల్సీ దాసోజు పేర్కొన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విద్యార్థులు, అధ్యాపకులు, సోషల్ మీడియా వాలంటీర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.పోలీసులు లాఠీచార్జి ద్వారా చేసిన దురాగతాలను అంగీకరించి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు.సుప్రీంకోర్టు స్టే ఈ ఉద్యమం సరైనదని, విద్యార్థుల పోరాటం న్యాయబద్ధమైనదని స్పష్టం చేసిందన్నారు.