- శ్రీరాంనగర్ కాలనీలో తొలుగుతున్న ఆక్రమణలు.
- సంతృప్తి వ్యక్తం చేసిన జేఏసీ.
మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు కొండాపూర్ డివిజన్ శ్రీరాంనగర్ కాలనీ బి-బ్లాక్ లో రోడ్ల ఆక్రమణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సంబంధిత శాఖల సిబ్బంది బృందం యంత్రాల సహాయంతో జనావాస ప్రాంతాల్లో ఆన్ లైన్ వ్యాపార సంస్థల అక్రమణల తొలగింపు చేపట్టారు. గత ఆరునెలలుగా చేస్తున్న ప్రయత్నాలకు అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల శ్రీరాంనగర్ కాలనీ జాయింట్ యాక్షన్ కమిటీ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. శ్రీరాంనగర్-బి కాలనీలో ఏర్పాటు చేసిన జప్టో కార్యాలయం చుట్టూ ఉన్న రోడ్ల ఆక్రమణలను జేసీబీ, సిబ్బంది సహాయంతో తొలగించారు. కాలనీలో రోడ్డుపైకి మెట్లు నిర్మించడమే కాకుండా భవనం చుట్టూ ఏర్పాటు చేసిన ఇనుప ఫ్రేమ్స్, రేకులు తదితరాలను పూర్తిగా తొలగించారు.ప్రయివేటు కార్యాలయాలు, కో-లివింగ్ హాస్టల్స్, ఇతర వ్యాపార సంస్థలు తమ భవనాల చుట్టూ ఉన్న అక్రమణలను మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో కూల్చి వేత కార్యక్రమం చేపట్టారు. ప్రయివేటు వ్యాపారులు, సంబంధిత ఇళ్ల యజమానులకు ఆక్రమణల తొలగింపు కార్యక్రమం భయాందోళనకు గురిచేసింది. శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ డిప్యూటీ కమిషనర్ సురేశ్, ఏసీపీ వెంకటరమణ ఆధర్యంలో మున్సిపల్ సిబ్బందితో పాటు శేరిలింగంపల్లి పోలీసు సిబ్బంది ఆక్రమణల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరాంనగర్-బి కాలనీలో 40 ఫిట్ల రోడ్డుతో పాటు ఇతర రోడ్ల వెంట ఉన్న సుమారు 50 నుండి అరవై ఆక్రమణలు తొలించారు.

- పూర్తయ్యే వరకు కొనసాగిస్తాం: మున్సిపల్ అధికారులు
కాలనీ వాసుల ఫిర్యాదు మేరకు జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఆదేశాలకనుగుణంగా మున్సిపల్ మరియు పోలీసుల సిబ్బంది కలిసి యంత్రాలతో శ్రీరాంనగర్ ఏబీసీ కాలనీల్లో డిప్యూటీ కమిషనర్ సురేష్ ఆధ్వర్యంలో ఆక్రణలు తొలగిస్తున్నామని ఏసీపీ వెంకటరమణ తెలిపారు. సాయంత్రానికి సుమారు 65 ఆక్రమణలు తొలగించామన్నారు.మూడు కాలనీల్లో ఆక్రమణలన్నీ పూర్తయ్యే వరకు స్పెషల్ డ్రైవ్ కొనసాగుందని, ఆక్రణ దారులకు ఇదో హెచ్చరిక అని గుర్తుచేశారు.
