- మంత్రి కొండా సురేఖ.
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో సుదీర్ఘకాలం సేవలందించిన 18 మంది ఉద్యోగులకు అర్చక సంక్షేమ నిధి ట్రస్టు ద్వారా గ్రాట్యూటీ, మెడికల్ సాయం కింద రూ. 32 లక్షల చెక్కులను మంత్రి కొండా సురేఖ అందజేశారు. అనంతరం రిటైర్డు ఉద్యోగులను ఆమె సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. అర్చక, ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమీషనర్ స్థాయి వరకు దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని ఆమె చెప్పారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరము లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటి ఇవ్వడం జరుగుతుందన్నారు. ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరము చెల్లించు గ్రాట్యూటి నిర్ధారించినట్టు చెప్పారు. మరణానంతరము చెల్లించు ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తము చెల్లింపు ఈ నిధి ఉపయోగపడుతుందన్నారు. ఈ నిధి కింద ఉద్యోగులకు మెడికల్ రీయింబర్స్ మెంట్, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మత్తుల నిమిత్త పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అందజేయడం జరుగుతుందన్నారు.