ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు షార్ట్లిస్ట్
ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్:
పర్యావరణ పరిరక్షణ, వర్షపు నీటి సంరక్షణ రంగాల్లో విశేష కృషి చేస్తున్న హైదరాబాద్కు చెందిన పర్యావరణవేత్త, రెయిన్వాటర్ హార్వెస్టింగ్ నిపుణుడు రంగ ప్రసాద్ ప్రతిష్ఠాత్మక ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు షార్ట్లిస్ట్ అయ్యారు. సస్టెయినబిలిటీ (ఎమర్జింగ్) విభాగంలో మరి కొంత మందితో పాటు ఆయనను ఎంపిక చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఓటింగ్ నిర్వహించి ఎక్కువ ఓట్లు లభించిన వారికి అవార్డును బహూకరిస్తారు.
రంగ ప్రసాద్ 2009 నుంచి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై పనిచేస్తున్నారు. 2016 నుంచి హైదరాబాద్లో వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆయన నిర్వహిస్తున్న ‘HydRainHarvest’ సంస్థ ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో వందలాది వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్ ( వాటర్ హార్వెస్టింగ్ పిట్స్) నిర్మాణాలను చేపట్టారు.
కొత్తగా రీచార్జ్ పిట్స్ నిర్మించడమే కాకుండా, నిర్లక్ష్యానికి గురైన పాత హార్వెస్టింగ్ పిట్స్ ను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, నిర్వహించడం వంటి కార్యక్రమాలను కూడా ఆయన చేపట్టారు.నీటి కొరత, భూగర్భ జలాల తగ్గుదల, వాతావరణ మార్పుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణను ప్రజల దైనందిన జీవన విధానంలో ఒక భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని రంగ ప్రసాద్ ప్రచారం చేస్తున్నారు.
అపార్ట్మెంట్ కమ్యూనిటీలు, వ్యక్తిగత గృహ యజమానులు, విద్యా–వాణిజ్య సంస్థలు వర్షపు నీటిని సంరక్షించడంలో తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఆయన అవగాహన కల్పిస్తున్నారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు రంగ ప్రసాద్ షార్ట్లిస్ట్ కావడం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర నీటి నిర్వహణ కోసం హైదరాబాద్లో కొనసాగుతున్న ప్రయత్నాలకు గుర్తింపుగా భావిస్తున్నారు. ఈ దిగువన ఇచ్చిన లోగోను ఉపయోగించి ఆయనకు ఓటు వేసి అవార్డు పొందడానికి సహకరించాలని పలువురు పర్యావరణవేత్తలు, ఆయన స్నేహితులు కోరుతున్నారు.
ఓటు వేయడానికి ఈ కింది లింక్ ను నొక్కండి