ముద్ర కూకట్పల్లి :
కేపీహెచ్బీ కాలనీలో నివాసముంటున్న కొలంపల్లి నారాయణ గౌడ్ (46) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మంతంగుడి గ్రామానికి చెందిన నారాయణ గౌడ్, తన భార్య శారదతో కలిసి గత నాలుగు నెలలుగా కేపీహెచ్బీ రోడ్ నంబర్ 2లోని క్లాసిక్ మెన్స్ పీజీ హాస్టల్’లో పనిచేస్తూ అక్కడే నివసిస్తున్నారు.మే 4వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఎవరికీ చెప్పకుండా ఆయన హాస్టల్ నుండి బయటకు వెళ్లారు.గత కొంతకాలంగా నారాయణ గౌడ్ మానసిక స్థితి సరిగా లేదని, గతంలో కూడా ఇలాగే ఒకసారి వెళ్లి తిరిగి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.బంధువుల ఇళ్లలో మరియు సమీప ప్రాంతాల్లో వెతికినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో శారద పోలీసులను ఆశ్రయించారు.
పైన పేర్కొన్న వ్యక్తి గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే కేపీహెచ్బీ పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు.