Take a fresh look at your lifestyle.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత -మంగళ, గురువారాల్లో ప్రజావాణి -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫిర్యాదుదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి నెలలో ఇప్పటివరకు మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ పిర్యాదు దారులు సమర్పించిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన ఉద్దేశమని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు బదిలీ చేస్తూ, నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రజల కోసం జిల్లా ఎస్పీతో పాటుగా జిల్లా లోని పోలీస్ అధికారులు అందరూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రత్యేకంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి మంగళవారం, గురువారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం ద్వారా క్లిష్టమైన, ప్రతికూల ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ అధికారులకు కీలక సూచనలు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని ఆదేశించారు. ఫిర్యాదుల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా పారదర్శకమైన సేవలు అందించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని ఎస్పీ స్నేహ మెహ్రా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.