ముద్ర, గద్వాల:
కే.టి.దొడ్డి మండలంలోని ఇర్కిచేడు గ్రామానికి చెందిన మహమ్మద్ జిందావలిపై గువ్వలదిన్నె గ్రామంలో జరిగిన దాడి కేసులో గద్వాల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. ఉదయ్ నాయక్ బుధవారం నిందితుడు కృష్ణమోహన్ రెడ్డికి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.200 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్న స్పష్టమైన సందేశం వెలువడినట్లు జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, తెలిపారు.
కేసు వివరాలిలా ఉన్నాయి., సెప్టెంబర్ 3వ తేది 2022లో మహమ్మద్ జిందావలి తన స్నేహితులు వినోద్ కుమార్, కురువ ఆంజనేయులు, భూపతి రెడ్డి లతో కలిసి మంత్రాలయం వెళ్లి తిరుగు ప్రయాణంలో గువ్వలదిన్నె గ్రామంలో టీ త్రాగుడం కోసం ఆగాడు. అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్ రెడ్డి, వినోద్ కుమార్పై కట్టేతో దాడి చేశాడు. ఇట్టి సమయంలో అడ్డుకునేందుకు వెళ్లిన జిందావలిపై కూడా దాడి చేసి గాయపరిచాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే క్రైమ్ నెo.97/2022, u/s 326, 504 IPC గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తు అధికారులు పకడ్బందీగా విచారణ జరిపి, బలమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో సమర్పించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కే. శంకర్, డీఎస్పీ వై. మొగిలయ్య, టి. శ్రీను పర్యవేక్షణలో కేసు ట్రయల్ సమర్థవంతంగా నడిపించబడింది. కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచెల్ సంజనా జాషువా వాదనలు బలంగా వినిపించగా, సాక్షులను సమయానికి హాజరుపరచడంలో కోర్టు సిబ్బంది కీలక పాత్ర పోషించారు.
ఇరుపక్షాల వాదనలు, సమర్పించిన సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన కోర్టు నేరం స్పష్టంగా రుజువైనట్లు తేల్చి నిందితుడికి శిక్ష విధించింది. ఈ కేసులో పోలీసులు చేపట్టిన కట్టుదిట్టమైన దర్యాప్తు, సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ కారణంగానే దోష నిర్ధారణ సాధ్యమైందని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా కోర్టులో నిందితునికి శిక్షపడేలా సాక్షులకు తగిన బ్రీఫింగ్ చేస్తూ, ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాచెల్ సంజనా జాషువా , అదనపు ఎస్పీ కే శంకర్ డిఎస్పీవై మొగిలయ్య, గద్వాల్ సిఐ టి శ్రీను, ప్రస్తుత కే.టి.దొడ్డి ఎస్ఐ శ్రీనివాసులు, కోర్టు లైసెన్ ఆఫీసర్ ఎస్సై జిక్కి బాబు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్ పిసి మహేష్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.