యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం
కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే
గ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావం
ట్రంప్ను నిలదీయడంలో మోదీ మౌనం
మోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి
29న హైదరాబాద్లో “నో వార్” భారీ ప్రదర్శన
తిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?
` విలేకరుల సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ చేపడుతున్న యుద్ధం దేశవ్యాప్తంగా మానవాళిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ యుద్ధం ద్వారా అమెరికాలోని కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతున్నాయని సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం కారణంగా భయానకమైన మరణాలు సంభవిస్తున్నప్పటికీ, దాన్ని నివారించాలంటూ అమెరికాపై ఒత్తిడి తీసుకురావడంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ వైఖరి ప్రశ్నార్థకరంగా ఉందన్నారు.
విజయవాడలోని దాసరి భవన్లో ఆదివారం డాక్టర్ కె. నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. యుద్ధం ప్రధానంగా చమురు వనరులపై ఆధిపత్యం సాధించడానికి, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికి డోనాల్డ్ ట్రంప్ చేపడుతున్న చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే భారత్లో పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. పెట్రోలు ధరల పెరుగుదల రవాణా రంగంపై తీవ్రమైన ప్రభావం చూపుతోందన్నారు. యుద్ధ పరిస్థితుల వల్ల గ్యాస్ కొరత ఏర్పడి హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు మూతపడిన సందర్భాలు ఉన్నాయని, దీని ప్రభావం నేరుగా కార్మిక, శ్రామిక వర్గంపై పడుతోందన్నారు. ప్రపంచంలో అత్యధిక ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, ఈ పరిస్థితుల్లో డోనాల్డ్ ట్రంప్ వైఖరిపై మౌనం పాటించడం సమంజసం కాదని విమర్శించారు. ముందుగా ఈ యుద్ధాన్ని నిలిపివేయాలని ట్రంప్పై మోదీ ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈ యుద్ధ అంశంపై మోదీపై ఒత్తిడి తేవగల నాయకుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న చంద్రబాబు, ట్రంప్కు మోదీ మద్దతు పలకకుండా యుద్ధాన్ని ఆపాలంటూ ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నాయకుడిగా చంద్రబాబు ముందుకు రావాలని ఆయన సూచించారు. అమెరికా యుద్ధోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ, ఈ నెల 29వ తేదీన హైదరాబాద్లో ‘నో వార్’ (యుద్దం వ్యతిరేక) పేరుతో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి భారీ శాంతి ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఇటీవల సీఎం చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకున్నారని గుర్తుచేశారు. ఆ పవిత్ర క్షేత్రానికి అపకీర్తి తెచ్చే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఛైర్మన్ పదవిలో కొనసాగించడం తగదని అభిప్రాయపడ్డారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసానికి సంబంధించిన దేవాలయానికి ఛైైర్మన్గా భక్తులను నియమించాలి గానీ, వ్యాపారవేత్తలను లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నియమించడం సరికాదని అన్నారు. తిరుమల ప్రతిష్టకు భంగం కలగకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.
అమరావతి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. అయితే, ఈ విగ్రహ నిర్మాణాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించి వ్యాపార పరంగా నిర్వహించడం తగదని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగువారి గుండెల్లో పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పారు. ఆయన్ని ఒకే కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఆయనపై వ్యక్తిగతంగా గౌరవం ఉన్నప్పటికీ, అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని తెలిపారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు.
ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండటం సహజమని, అయితే ఆస్తుల కోసం బహిరంగంగా వివాదాలు జరగడం బాధాకరమని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మిత్రుడని పేర్కొంటూ, ఆయన కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న ఆస్తి వివాదాలపై విచారం వ్యక్తం చేశారు. ఇటీవల వైఎస్ విజయలక్ష్మి విడుదల చేసిన లేఖను గుర్తుచేశారు. వ్యక్తిగత ఆస్తి వివాదాలు న్యాయపరంగా లేదా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. రాజకీయ అంశాలపై చర్చించడం సహజమే అయినప్పటికీ, కుటుంబ వ్యవహారాలను బహిరంగంగా తీసుకురావడం కుటుంబ వ్యవస్థకు అవమానకరమని అన్నారు. ఇది వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసత్వానికి కూడా నష్టం కలిగించే అంశమని అభిప్రాయపడ్డారు.
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు 3 సెంట్లు, పట్టణ పేదలకు 2 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు గృహనిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ నెల 24న సిపిఐ రాష్ట్ర సమితి పిలుపునిచ్చిన ఆందోళనల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా, ఇచ్చిన హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని, అద్దె ఇళ్లలో నివసిస్తున్న పేదలకు అద్దెను ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.
` యడ్ల కృష్ణ కిషోర్,
ఆఫీసు కార్యదర్శి,
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post