ముద్ర న్యూస్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్యకు బీసీ సంఘాల మద్దతు ఇప్పటికే బీసీ ఉపాధ్యాయ సంఘం మద్దతు తెలిపిన విషయం తెలిసిందే తాజాగా బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈరోజు కరీంనగర్ లో మల్క కొమరయ్యను కలిసి తమ మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి మచ్చలేని మనిషి మల్లె పువ్వు లాంటి మనసున్న మల్క కొమరన్నను మనం ఈసారి గెలిపించుకుంటే చట్టసభలకు పంపిస్తే బీసీ వాదం బలపడుతుందని అన్నారు. కొమరన్న గెలిస్తే బీసీలందరు గెలిచినట్టే అని తద్వారా బీసీల రాజ్యాధికారం త్వరలో వస్తుందని, 2028 ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్ అని అన్నారు. కచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు రాజకీయాలకు సంఘాలకు అతీతంగా మల్క కొమరన్నకు మద్దతు తెలిపితే బీసీ బిడ్డ చట్టసభల్లో పోతే మన బీసీల సమస్యలు గానీ అటు ఉపాధ్యాయుల సమస్యలు గాని బలంగా వినిపించే అవకాశం ఉందన్నారు. ప్రశ్నించే గొంతుక మల్క కొమరన్న అని, మన బీసీలు ఈసారి అవకాశం ఇవ్వాలని, అలా కాకుండా వంగ మహేందర్ రెడ్డిని గెలిపిస్తే బీసీ వాదం బలం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకోకరు గెలిస్తే మళ్ళీ అధికార పార్టీ లోకి వెళ్తాడని, ప్రశ్నించే గొంతుక కాదని, అలా జరగకుండా ఉండాలంటే బీసీలంతా ఐక్యమై కొమరన్నకు బారీ మెజార్టీ ఇచ్చి చట్టసభలకు పంపాలని బీసీలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని కోరారు.
పీఆర్టీయూను నమ్మరు : మల్క కొమురయ్య
అనంతరం మల్క కొమరయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో రోజురోజుకి తనకు మద్దతు పెరుగుతుందని, పిఆర్టియును నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. ఆ సంఘంలోనే నాలుగైదు వర్గాలు అయ్యాయని, తాజాగా బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తన బృందంతో కలిసి నాకు మద్దతివ్వడం చాలా సంతోషకరమన్నారు. ఖచ్చితంగా మీ నమ్మకాన్ని వమ్ము చేయనని నాకు అవకాశం కల్పించి చట్టసభకు పంపిస్తే మీ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తానని తెలిపారు.