యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: భారత దేశంలో అత్యధిక సభ్యత్వ నమోదు కలిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) 70వ ఆవిర్భావ దినోత్సవం ఈ నెల 23న ఘనంగా నిర్వహిస్తున్నట్లు, సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలిపారు. ఈ ఆవిర్భావ దిన వేడుకలు దేశ కార్మిక రంగానికి పర్వదినమని ఆయన అభివర్ణించారు. మంగళవారం ఉదయం సంఘం స్తానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశాభివృద్ధి, పరిశ్రమల ప్రగతి, కార్మికరంగం మనుగడ లక్ష్యంగా బిఎంఎస్ ముందుకు సాగుతున్న ఏకైక సంఘమని ఆయన వ్యాఖ్యానించారు. 44 చట్టాలను కాలరాసి, 4 కోడ్ లను తీసుకువచ్చిన కేంద్రప్రభుత్వంపై కేంద్రం లోని, రాష్ట్రం లోని రాజకీయ సంఘాలకు వంత పాడే కొన్ని కార్మికసంఘాలు, గొంతు చించుకోవడంలో అర్థం లేదని ఆరోపించారు. ఆ కోడ్ లలో మొదటిది ఉద్యోగం చేస్తూ ఉద్యోగి అయి ఉన్నవారే కార్మిక సంఘానికి సమర్థవంతమైన నాయకత్వం వహించగలరని, అప్పుడే పరిశ్రమకు పరిరక్షణ, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. రెండవది బొగ్గు బ్లాక్ లను అంబానీ, ఆదానీ లకు అప్పగిస్తున్నారనే కొన్ని కార్మిక సంఘాలు చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని పారదర్శకంగా కేటాయింపులు జరగాలనే భారత ప్రభుత్వం వేలం పాట ద్వారా బొగ్గు బ్లాకులను కేటాయిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే మరో రెండు కోడ్ లు కూడా కార్మికరంగం అభ్యున్నతి, దేశ ప్రగతికి అనుగుణంగా ఉన్నాయన్నారు. అలాగే రాజకీయ పార్టీలకు, పాలకవర్గాల బిఎంఎస్ సంఘం అనుకూలం కాదని, కేవలం కార్మికవర్గం మనుగడే లక్ష్యంగా ముందుకు సాగుతుందన్నారు. ఇక సంఘం ప్రధాన కార్యదర్శి వై. సారంగపాణి మాట్లాడుతూ.. ఈ నెల 23న నిర్వహిస్తున్న బిఎంఎస్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, స్తానిక కార్యాలయంలో సంఘం ఉప ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో సింగరేణి రామగుండం రెండవ ఏరియాలోని కాలని కార్మిక వాడలలో పారిశుద్ధ పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను సన్మానించడం జరుగుతుందని తెలిపారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కేంద్ర కమిటీ కార్యదర్శి మాదాసు రవీందర్, ఏరియా ఉపాధ్యాక్షులు వడ్డేపల్లి కుమారస్వామి, ఏరియా కార్యదర్శి గట్టు శ్రీనివాస్, లింగం నాయక్ తదితరులు పాల్గొన్నారు.