- పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పెషల్ లీవ్ పిటిషన్
- స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని పిటిషన్ లో పేర్కొన్న బీఆర్ఎస్
- నాలుగు వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- తమ పార్టీ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ గురువారం సుప్రీం కోర్టు ఆశ్రయించింది. ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు చేసింది. బీఆర్ఎస్ మొత్తం పదిమంది శాసనసభ్యులుగా హస్తం గూటికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ, ఏడుగురు ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీలు వెంటనే చర్యలు తీసుకునేలా, టైం ఫిక్స్ చేసేలా ఆదేశించాలని పిటిషన్ లో కోరింది. కాగా ఎంఎల్ఎలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. మిగతా ఏడుగురిపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెలలైనా ఇప్పటికీ స్పీకర్ చర్యలకు ఉపక్రమించలేదని పిటిషన్లో పేర్కొంది. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.ఇందులో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా సైతం పోటీ చేశారు. ఈ నేపథ్యంలో వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తోంది. స్పీకర్ కు కంప్లైంట్ తో పాటు హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని.. వారి స్థానాల్లో ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయని బీఆర్ఎస్ టాప్ లీడర్లు అనేక సార్లు చెబుతూ వస్తున్నారు. కాగా నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ….. ఉన్నత న్యాయ స్థానం నుంచి ఎలాంటి తీర్పు రానుందో అన్న అంశంపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Prev Post