ముద్ర ప్రతినిధి, నిర్మల్:
బాలలు కూడా సమాజంలో ఒక భాగమని, వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని
స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సభ్యురాలు ప్రమీల అగర్వాల్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె శనివారం పర్యటించారు. మామడ మండలం జగదాంబ తండా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడి కేంద్రంలోని రికార్డులను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్నారు. పిల్లలకు సరైన సమయంలో పోషకాహారం అందించాలని సూచించారు. అనంతరం కొండాపూర్ బాలసదనం సందర్శించి పిల్లలతో మాట్లాడారు. పిల్లలను సక్రమంగా చూసుకోవాలని, వారికి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారి వినూత్న, సీడబ్ల్యూసీ మెంబర్ శ్రీలత, జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, బాలసదనం సూపరిండెంట్ వైష్ణవి , సూపర్వైజర్ రజిని, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.