Take a fresh look at your lifestyle.

హస్తంలో హల్​ చల్​

  • నియోజకవర్గ అభివృద్ధి నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యేల అసంతృప్తి
  • ఇద్దరు మంత్రులే టార్గెట్​ గా రహస్య భేటీ..?
  • టీపీసీసీ పట్టించుకోకపోతే ఏఐసీసీ వద్దే తేల్చుకుంటామని ఆల్టీమేటం
  • టీపీసీసీ నేతలపై బాహాటంగానే ఆరోపణలు
  • పార్టీ డ్యామేజ్​ ను పూడ్చుకునే పనిలో సీఎం, టీపీసీసీ
  • రంగంలో దీపాదాస్​ మున్షి
  • తాజా పరిణామాలపై రేపు ఏఐసీసీకి నివేదిక..?
  • ఆరా తీసిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి..?

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీ అనూహ్య మలుపు తీసుకున్నది. త్వరలోనే స్ధానిక పోరు జరగనుండడం.. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోన్న నేపథ్యంలో ఎమ్మెల్యే రహస్య భేటీ టీపీసీసీ కీలక నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. గతనెల 31న హైదరాబాద్​ శివారులోని ఓ హోటల్​ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య భేటీ రగడ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సమావేశంపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించడం రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. సమావేశంలో పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతోన్న ఎమ్మెల్యేల్లో ఒకరైన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి.. పలువురు ఎమ్మెల్యేలం సమావేశం అయిన మాట వాస్తవమే అని స్పష్టత ఇచ్చారు. మరోవైపు ఆ సమావేశంలో పాల్గొన్నట్టు ప్రచారం జరుగుతోన్న మరో వరంగల్ వెస్ట్ ఎమ్మె్ల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాత్రం అసలు తాను ఆ సమావేశంలో పాల్గొన లేదని కరాఖండిగా చెప్పేశారు. కాగా ఆ భేటీలో పాల్గొన్న ఇంకొందరితో పాటు వారికి మద్దతుగా మరికొందరు ఎమ్మెల్యేలు భేటీ అయితే తప్పేంటని ప్రశ్నించడం కాంగ్రెస్ లో కలకలం రేపుతుంది. మరోవైపు.. అసలు ఆ భేటీలో ఎవరెవరు పాల్గొన్నారు..? ఎందుకు బేటీ అయ్యారనే విషయాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికే కూపీ లాగుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్​ శివారులో ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పదకొండు మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు పార్టీ నిర్ధారణకు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఈ భేటీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఓ మంత్రి వ్యవహారశైలి పైన చర్చించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఆ మంత్రి పై పలువురు ఎమ్మెల్యేలు, సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం.

వివాదస్పదంగా అనిరుధ్​ వ్యవహారం..?

ఎమ్మెల్యే అనిరుధ్​ రెడ్డి వ్యవహారం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. రహస్య భేటీపై స్పందించిన ఆయన తనతో పాటు పదకొండు ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని ఒప్పుకోవడం పైగా అందులో తప్పేముందేని ప్రశ్నించడాన్ని టీపీసీసీ నేతలు సీరియస్​ గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఒకచోట కలిసి మాట్లాడుకున్నామని అనిరుధ్​ రెడ్డి ఇచ్చిన వివరణపై ఓ కీలక నేత మండిపడినట్లు సమాచారం. అభివృద్ధి విషయంలో చర్చించాల్సి ఉంటే.. సంబంధిత జిల్లా మంత్రి లేదా సీఎంతో మాట్లాడవచ్చు, కానీ ఎవరికీ తెలియకుండా భేటీ కావడం వెనక ఉద్దేశ్యమేంటని ఆరా తీసినట్లు తెలిసింది. మరోవైపు ప్రచారం జరుగుతున్నట్టు ఇంత మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్న మంత్రుల గురించీ సీఎం, టీపీసీసీ చీఫ్​ ఆరా తీశారు. ఆయా మంత్రులు, ఎమ్మెల్యేల మద్య విభేదాలకు గల కారణాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదీలావుంటే ఓ మీడియాతో మాట్లాడిన అనిరుధ్​ రెడ్డి పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ఆధారాలతో పెద్దలకు వివరిస్తానని చెప్పారు. త్వరలోఏ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షిని కలిసి పలు విషయాలపై మాట్లాడాల్సి ఉందన్నారు. పార్టీలో ఉన్న ప్రతికూల పరిస్థితులేవీ… ఆయన వద్ద ఎలాంటి ఆధారాలు ఉన్నాయి.. హఠాత్తుగా అనిరుధ్​ రెడ్డిలో ఈ మార్పుకు కారణమేంటీ.? ఆయన అధిష్టానానికి ఎలాంటి నివేదిక ఇవ్వనున్నారో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలనూ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్​ గా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అదే సమయంలో రాష్ట్రంలో ఇంత మంది సీనియర్లు ఉన్నా వారితో కనీసం చెప్పకుండా అనిరుధ్​ రెడ్డి నేరుగా అధిష్టానం పెద్దల పేర్లు చెప్పడాన్ని టీపీసీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదేమైనా ఎమ్మెల్యేల ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోననే ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.

Leave A Reply

Your email address will not be published.