- అంతర్ రాష్ట్ర ప్రాజెక్ట్ పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ది
- సేద్యంలోకి రానున్న 66282.54 ఎకరాలు
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో నాందేడ్ ఎంపీ భేటి
ముద్ర, తెలంగాణ బ్యూరో : మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు తెలంగాణా రాష్ట్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం మహారాష్ట్ర నాందేడ్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ యం.పి రవీంద్ర చవాన్, మాజీ యం.ఎల్.ఏ హనుమంత్ రావు పాటిల్, సురేష్ పండిత్ వార్,సుభాష్ బాద్,వాకిడిష్వార్,దినేష్ అవాజ్,సందీప్ పాటిల్ తదితర మహారాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలసి లెండి భారీ ప్రాజేక్ట్ పూర్తి చేసే అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. 1984లో రూ. 2183.88 కోట్ల అంచనా వ్యయంతో మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా వద్ద ప్రారంభించిన లెండి భారీ ప్రాజెక్ట్ పూర్తయితే తెలంగాణలో 38573.15 ఎకరాలు, మహారాష్ట్రలో 27710.397ఎకరాలు సేద్యంలోకి వస్తుందన్నారు.ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలు ఈ ప్రాజెక్ట్ పై రూ. 1040.87 కోట్ల ఖర్చు చేసి 70 శాతం ఎర్తేన్ డ్యామ్ పనులు, 80శాతం స్పిల్ వే పనులు పూర్తి చేశారన్నారు. ప్రస్తుతం కాలువల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. భూ అంతర్బాగం నుండి నీటి సరఫరాకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అయితే భూనిర్వాసితులు అడ్డుపడడంతో 2011 లో అర్దాంతరంగా నిలిపివేయబడిన పనులను తిరిగి పునరుద్దరుంచడంతో నది గర్భంలోని మట్టి పనులను పూర్తి చేసే విదంగా ప్రణాలికలు రూపొందించుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రెండు రాష్ట్రాల ఒప్పందంలో భాగంగా వచ్చే యాడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.