- ఇది ప్రజాపాలన కాదు ఇది, నిర్బంధ పాలన
- ఆంక్షలు, కంచెలు, అరెస్టులు, నిర్బంధాలు రేవంత్ పాలనలో నిత్యకృత్యం
- అరెస్టు చేసిన ప్రజా సంఘాల నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం
ముద్ర, తెలంగాణ బ్యూరో :- నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో మైనింగ్ కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ ను అరెస్టు చేయడం అమానుషమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రజా పాలన, ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటూ గప్పాలు కొట్టి, ఇప్పుడు ప్రజల తరుపున పోరాటం చేస్తున్న ప్రజా సంఘాల నాయకుల గొంతులు నొక్కడం అమానుషమని మండిపడ్డారు. ఇదే సీఎం రేవంత్ చెప్పిన…సోకాల్డ్ ప్రజా పాలన అని నిలదీశారు.
ఇందిరమ్మ రాజ్యమని చెప్పిన మీరు కంచెలు, ఆంక్షలు, అరెస్టులతో నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారన్నారు.సీఎం సొంత జిల్లాలోనే ఇంతటి దారుణ పరిస్థితులు ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకనటంలో పేర్కొన్నారు.మైలారంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? అని ప్రశ్నించారు.ప్రొఫెసర్ హరగోపాల్ సహా అరెస్టులు చేసిన ప్రజా సంఘాల నాయకులను తక్షణం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.