ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో బీర్ల సరఫరాలను యూనైటెడ్ బ్రూవరీస్ సంస్థ (యూబీఎల్) పునరుద్ధరించింది. .బీర్ల ధరల పెంపు, పాత బకాయిల విడుదలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో బీర్ల సరఫరా పునరుద్ధరణ చేస్తున్నట్లు యూబీఎల్ ఒక లేఖను సోమవారం నాడు విడుదల చేసింది. వినియోగదారులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా మధ్యంతర నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత రెండేళ్ళుగా రూ.702 కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయలేదని, అలాగే బీర్ల ధరలను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించిన ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపిస్తూ యూబీఎల్ బీర్ల సరఫరాను నిలిపివేసిన విషయం తెలిసిందే.
బీర్ ధరలో 70 శాతం పన్నులే ఉన్నాయని పేర్కొంది. గిట్టుబాటు కావడం లేదని, భారీగా నష్టాలు వస్తున్నాయని యూబీఎల్ బీర్ల సరఫరాను నిలిపివేసింది. అయితే ఇటీవల సంక్రాంతి పండుగ సీజన్ లో పెద్ద ఎత్తున బీర్ల అమ్మకాలు జరిగాయి. అలాగే వేసవి కాలంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరుగుతాయి. అందుకే కంపెనీ కూడా మార్కెట్ కోల్పోతే మళ్లీ సాధించుకోవడం కష్టమని ఆలోచించి వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ప్రభుత్వం మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి ఆధ్వరంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ బీర్ల సరఫరాలను పునరుద్ధరించింది.