ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి) జోష్ 2కే25 పేరుతో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. కె. రామకృష్ణ మాట్లాడుతూ కళాశాల స్వయం ప్రతిపత్తి హోదాను సాధించడంతో విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించగలుగుతున్నామని, మంచి ప్రణాళిక, నిరంతర శ్రమ, కృషి అంకితభావంతో విద్యార్థులు ఉన్నత స్థాయి లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. కళాశాలలో చదువుతున్న రోజులు హ్యాపీ డేస్ లాంటివని, చదువుతో పాటు సమాంతరంగా కెరీర్ సంబంధించిన వాటికి సన్నద్ధమవుతూ ఉండాలన్నారు. త్వరలో విద్యార్థుల అవసరాల మేరకు మంచి డిమాండ్ ఉన్న పి.జి. కోర్సులు మొదలు పెట్టవచ్చన్నారు.త్వరలో జరుగబోయే సెమిస్టర్ పరీక్షలలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా. ప్రమోద్ కుమార్, జి. చంద్రయ్య, డా. వరప్రసాద్, ఎం.ఎ. రహీమ్, సంగీత రాణి, డాక్టర్ వాసవి, కుమారి నీరజ, మల్లికార్జున, జమున, విద్యార్థులు పాల్గొన్నారు.
