ముద్ర, తెలంగాణ బ్యూరో : మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత ఘన్ పూర్ సర్వీసు రోడ్డులో వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతోనే ఇద్దరు మృతి చెందారని పోలీసులు భావించారు. అయితే వీరిద్దరూ ప్రేమ జంట అని, ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సోమవారం సాయంత్రం జరిగిన ఈఘటనలో మృతులను శ్రీరామ్, లిఖితగా గుర్తించారు. కారులోపలే ఉండి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. ఇరుకుటుంబాల పెద్దలు పెళ్లికి అంగీకరించలేదనే ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు వాళ్లు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఘటనాస్థలిలో 3 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ స్వస్థలం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జమ్ములపేట కాగా, యువతి మేడ్చల్ జిల్లాకి చెందినవారిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.