ఆ తర్వాతే కేటీఆర్ పాదయాత్ర, పార్టీ పేరు మార్పు విషయంలో ఆలోచన చేయాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో ఏం సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని గతంలో శాసనమండలి వేదికగా కవిత బీఆర్ఎస్ కు వేసిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాతే కేటీఆర్ పాదయాత్ర, పార్టీ పేరు మార్పు విషయంలో ఆలోచన చేయాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. కేటీఆర్ కు పౌరుషం ఉంటే బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చర్చకు ముందుకు రావాలని సవాల్ చేశారు నిరుద్యోగుల ఉసురు తగిలి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందన్నారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకో.. దాచుకో అనేది బీఆర్ఎస్ సిద్ధాంతం అని విమర్శించారు. అసూయతోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయడం కేటీఆర్ మానుకోవాలని హితవు పలికారు.తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకోని కేసీఆర్ ప్రభుత్వం.. పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని కవిత చేసిన నిలదీతను మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు.