ముద్ర, హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వృద్ధురాలు యశోద(80) మున్సిపల్ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఊపిరితిత్తుల శ్వాసకోశ వ్యాధితో బాధపడుతోన్న ఆమె ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే శ్వాస తీసుకుంటున్నారు. అయినా ఓటు హక్కును వినియోగించాలనే తన సంకల్పాన్ని ఆమె చాటుకున్నారు. యశోదకు కరోనా సమయంలో వైరస్ సోకడంతో ఆమె ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పటి నుంచి శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతూ, గత ఐదేళ్ల నుంచి నిరంతరం ఆక్సిజన్ సిలిండర్పై ఆధారపడి జీవిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ తొలగిస్తే ప్రాణాపాయం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించడంతో కుటుంబ సభ్యులు ఆమెకు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ సరఫరా అందిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాముఖ్యతపై ఉన్న విశ్వాసంతో యశోద హుజూరాబాద్ పట్టణంలోని 21వ వార్డులోని 41వ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. శారీరక అసౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనాలనే ఆమె సంకల్పం అక్కడున్నవారిని ఆకట్టుకుంది