హైదరాబాద్ ముద్ర కూకట్పల్లి ఫిబ్రవరి 23 :
జేఎన్టీయూ (JNTU) అనుబంధ కళాశాలల్లో చదువుతున్న బి.ఫార్మసీ నాలుగో సంవత్సరం విద్యార్థులను అన్యాయంగా డిటైన్ చేయడంపై స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. వెంకటేశ్వరరావును కలిసి ఫోరం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
2023 డిసెంబర్లో విడుదల చేసిన రెగ్యులేషన్ల ప్రకారం క్రెడిట్ నిబంధనలు లేవని స్పష్టంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు కొత్త సర్క్యులర్ను సాకుగా చూపి విద్యార్థులను ఆపడం సరికాదని నాయకులు పేర్కొన్నారు.
నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న సమయంలో, హాల్ టికెట్లు జారీ చేసిన తర్వాత.. అకస్మాత్తుగా వాట్సాప్ గ్రూపుల ద్వారా డిటైన్ చేసినట్లు ప్రకటించడం విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండో ఏడాది నుంచి మూడో ఏడాదికి ఏ నిబంధనలతో ప్రమోట్ చేశారో, అవే నిబంధనలను నాలుగో ఏడాదికి కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
వెంటనే జోక్యం చేసుకుని డిటైన్ అయిన విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని వారు రిజిస్ట్రార్ను కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు జయరాం, రాజ్కుమార్, వసంత్, రిషి వరుణ్, రాబిన్, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.