- మీ దగ్గర పత్రాలు ఏవీ..?
- దూకుడు పెంచిన ఏసీబీ
- గ్రీన్ కో కంపెనీలో సోదాలు
- కీలక పత్రాలు స్వాధీనం
- విచారణకు పిలిచే అవకాశం..?
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ కేసులో అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ఏసీబీ అధికారులు మరింత దూకుడు పెంచారు . కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించిన కంపెనీలపై పలుచోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. గ్రీన్ కో ఆఫీస్తో పాటు ఏస్ జెన్నెక్ట్స్ కంపెనీలో మంగళవారం ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ తో పాటు విజయవాడ, మచిలీపట్నం ఆఫీసుల్లో తనిఖీల కోసం 10 మంది అధికారుల బృందం సోదాలు చేసింది. ఉదయం 11 గంటలకు మాదాపూర్లోని గ్రీన్ కో సంస్థకు చెందిన ఆఫీసులో సోదాలు చేపట్టారు. ఎన్నికల బాండ్ల పేరిట రూ. 41 కోట్ల బీఆర్ఎస్కు ఇచ్చిన నేపథ్యంలో దానిపై ఆరా తీశారు. ప్రధానంగా మీకు నిధులు ఎలా వచ్చాయి? బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు ఎలా ఇచ్చారు?
దానికి సంబంధించిన పత్రాలు ఏవీ? అంటూ పలు రకాల ప్రశ్నలతో గ్రీన్ కో అధికారులకు ఏసీబీ అధికారులు చమటలు పట్టించారు. గతంలో జరిగిన లావాదేవీలను సైతం పరిశీలిస్తున్నారు. కాగా నాటి అప్పటి ఒప్పందాలపై నోటీసులు ఇవ్వనున్న నేపథ్యంలో త్వరలోనే సంబంధిత సంస్థ అధికారులను సైతం ఏసీబీ అధికారులు విచారణకు పిలిచే అవకాశముందని తెలుస్తోంది.
అతి తక్కువ సమయంలోనే
పాతికేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా గ్రీన్ కో సంస్థ ఏర్పాటైంది. తక్కువ సమయంలో భారీ కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీ వాళ్లకు వ్యాపార వర్గాలతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కంపెనీ డైరెక్టర్గా అనిల్ ఉన్న సమయంలో ఆయన బ్రదర్ సునీల్ ఎన్నికల్లో ప్రజారాజ్యం, టీడీపీ, వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గ్రీన్ కో సంస్థ పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. వివిధ రాష్ట్రాల్లో ఆ కంపెనీ దక్కించుకున్న ప్రాజెక్టులు కలిపితే దాదాపు లక్ష కోట్ల వరకు ఉంటాయన్నది ఒక అంచనా. గడిచిన పదేళ్లు తెలంగాణలోని బీఆర్ఎస్ సర్కార్తో ఈ కంపెనీకి సన్నిహిత సంబంధాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు ఏపీలోని మచిలీపట్నంలో గల ఏస్ అర్బన్ డెవలపర్స్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది.