ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భూ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా లోని సారంగాపూర్ మండలంలోని రంగపేట, బీర్పూర్ మండలంలో నర్సింహులపల్లి గ్రామలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణాను భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిష్టాత్మకంగా చేసిన భూభారతి చట్టం-2025, భూభారతి నియమావళి-2025 అమలు అమలు చేసేందుకు జూన్-3 నుండి రాష్ట్ర వ్యాప్తముగా రెవెన్యూ సదస్సులను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలలో భాగంగా జగిత్యాల డివిజన్ లోని అన్నీ మండలాలలోని రెవెన్యూ గ్రామాలలో జూన్-3 నుండి జూన్-20 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సదస్సులలో అధికారుల బృందాలు రెవెన్యూ గ్రామాల వారీగా సందర్శించి రైతుల నుండి భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని, రైతులందరు భూ సమస్యల అర్జీలతో పాటు సంబంధిత పత్రాలు జత చేసి అధికారులకు ఇవ్వాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో జూన్-3 నుంచి 20 వరకు జరుగబోయే రెవెన్యూ సదస్సుల షెడ్యూల్ రెవెన్యూ గ్రామాల వారీగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, సారంగాపూర్, బీర్పూర్, తహసీల్దారులు, ఎంపీడీవోలు రెవెన్యూ సిబ్బంది సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
