- రాష్ట్రాల పరంగా జరగాలి
- రేవంత్ ప్రతి నిర్ణయం భూం రాంగ్
- ప్రభుత్వంతో కొట్లాడేది కమలమే
- తెలంగాణలో ఇక బిజెపి ప్రభుత్వమే
ముద్ర ప్రతినిధి, ఖమ్మం: “కులగణన కాదనలేని సత్యం.. వద్దంటే ఆగేది కాదు,కులాన్ని విస్మరించలేము,రాష్ట్రాల పరంగా కులగణన జరగాలి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులంకి ఒక్కో రిజర్వేషన్ ఉంది.. దేశవ్యాప్తంగా లెక్క చేయడం కష్టమే అని” భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు. వైశ్యులు, బ్రాహ్మణులు ఏ రాష్ట్రమైనా ఓసీలుగానే ఉన్నారని ఇతర కులాలు ఒక్కో రాష్ట్రంలో ఒక్క విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే కమిషన్ వేసి సైంటిఫిక్ గా కులగణన చేయాలని..తమిళనాడు చట్టబద్ధ కమిటీ వేసి చేసింది.. బీహార్ కూడా అలానే చేసిందన్నారు. 2011 లో 3.67 కోట్లు ఉన్న తెలంగాణా జనాభా నేడు 4.5 కోట్లు దాటి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ కు నిజాయితీ లేదు, బ్లఫ్ చేసి మోసం చేసి కుల గణన లెక్కలు ప్రకటించారని, ఆయన ప్రతి నిర్ణయం భూం రాంగ్ అవుతుందని ఎద్దేవ చేశారు. బీజేపీ బల పరిచిన ఉమ్మడి వరంగల్ – నల్గొండ – ఖమ్మం నియోజకవర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి ప్రచారంలో భాగంగా ఎంపీ ఈటెల ఖమ్మం లో పర్యటించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాలెట్ పేపర్ లో సరోత్తం రెడ్డి కు 1 అంకెతో మొదటి ప్రాదాన్యత ఓటు వెయ్యాలని కోరారు. ఆయన కాకుండా మరొక అభ్యర్థి తమ బంధువు, దగ్గర స్నేహితులు అయితే కనీసం 2 ప్రాధాన్యత ఓటు అయిన బిజెపి మద్దతిస్తున్న సరోత్తం రెడ్డి కు వేయాలని కోరారు. పదేళ్లలో బీఆర్ఎస్ మోసం చేసిందని, 15 నెలల్లో కాంగ్రెస్ మోస పూరిత హామీలతో అధికారం చేపట్టిందని అన్ని వర్గాల ప్రజలకు అర్థమైందని రానున్న రోజుల్లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక ఏ ఎన్నిక జరిగిన బిజెపిని గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని ఈటెల తెలిపారు. ఇటీవల అమెరికా పర్యటనలో భారత ప్రధాని మోడీ కూర్చొని సంతకం చేసే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుర్చీ వెనక నిలుచున్నారని. ప్రతి భారతీయుడు “ఐయామ్ ఇండియన్” అని సగర్వంగా చెప్పుకుంటున్నారని ఎంపీ ఈటెల పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పైసా ఇంట్రస్ట్ లేకుండా కేంద్రం లక్ష 50 వేల కోట్ల నిధులు రాష్ట్రాలకు ఇస్తుందన్నారు.ఉపాధ్యాయుల 317 జీవో, పెన్షన్ సమస్యలు, హైడ్రా తదితర బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించిందని తీవ్రంగా విమర్శించారు. మోడీ వచ్చిన తర్వాత జాతీయ రహదారులు లు ఎయిర్పోర్ట్లు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో జనాభా పెరుగుతుంది అనేది సత్యం..మరి బీసీ జనాభా ఎలా తగ్గుతుందన్నా రు. తప్పులు లేకపోతే మళ్లీ ఎందుకు సర్వే నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తెలంగాణ అణగారిన వర్గాలకు నిలయమని పార్లమెంట్ లో అంటారు… మరి బీసీల జనాభా 46 శాతం ఉంటుందా ? కాంగ్రెస్ నేతలకు మోసం చెయ్యకని మరోసారి చెప్తున్నాo. మీలా డ్రామా కంపెనీ కాదు.. మాది మాట ఇస్తే తప్పదనే బీజేపీ మోడీ ప్రభుత్వమన్నారు . ఎంత కష్టమైనా ప్రజా సంక్షేమం అమలు చేస్తామన్నారు. 1956 నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 45 ఏళ్లు పైగా పాలించింది కాంగ్రెస్ నే కదా.. ఒక్క బీసీ సీఎం ఎందుకు చేయలేదు? ఎవరు అడ్డం వచ్చారని ప్రశ్నించారు. బీఆర్ ఎస్, టీడీపీ ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలని సోషల్ జస్టిస్ గురించి మాట్లాడలేవని అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, సైదిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శీలం పాపారావు, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.