- గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతి.
ముద్ర ప్రతినిధి కల్వకుర్తి :రైతులు భూసారాన్ని కాపాడుకునేందుకు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని రసాయన ఎరువుల అధిక వినియోగం వల్ల అనేక అనర్థాలు వస్తాయని రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గృహ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రీతి అన్నారు.గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పంజుగుల గ్రామంలో రైతులకు పంట సాగుపై నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.ప్రతి రైతు పంట మార్పిడి చేయాలని, నూతన వంగడాలను సాగు చేయాలని సూచించారు.ఎరువులు, మందుల దుకాణాల్లో కొనుగోలు చేసిన సమయంలో వ్యాపారి నుండి తప్పక రసీదు తీసుకోవాలని అన్నారు.భూగర్భ జలాలను పూర్తిగా తోడివేయడంతో పంట చేతికొచ్చే దశలో సరిపడా నీరు అందక ఎండిపోయే ప్రమాదం ఉంటుందని పొదుపు పాటించి పంటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.పంట కోత అనంతరం వ్యర్థాలకు నిప్పంటించవద్దని వాటిని నేలలో కలియ దున్నడం వల్ల భూసారం పెరుగుతుందని సూచించారు.ప్రతి రైతు వ్యవసాయ అధికారుల, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకొని సాగు చేయడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చని అన్నారు.కార్యక్రమంలో ఏఈఓ పాష, యువ శాస్త్రవేత్తలు ,గ్రామ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.