ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలో ప్రభుత్వం నుండి ధాన్యాన్ని తీసుకొని దుర్వినియోగం చేసిన రైస్ మిల్లర్లపై ఉక్కు పాదం మోపుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం వనపర్తి మండలం నాచహళ్లి గ్రామంలోని రిలీక్ ఆగ్రో రైస్ మిల్లు లో తనిఖీలు నిర్వహించగా ధాన్యం నిల్వలో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించిన స్థానిక ఎమ్మార్వో రమేష్ రెడ్డి సదరు రైస్ మిల్ పై కేసు నమోదు చేశామని తెలిపారు.

వనపర్తి జిల్లాలోని M/s రిలిక్ ఆగ్రో ఇండస్ట్రీస్ (OPC) ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రభుత్వం రబీ 2022 – 23 సీజన్ కు సంబంధించిన ధాన్యం నిల్వలను తమ స్వప్రయోజనాల కోసం వినియోగించుకొని, ప్రభుత్వం కేటాయించిన ధాన్యం 15678.640 MTs గాను మిల్లరు 10661.475 MTs బియ్యం మర ఆడించి ఇవ్వాల్సి ఉండగా కేవలం 1089.288 MTs ప్రభుత్వానికి అప్పగించారు. మిల్లులో ఉండాల్సిన మిగిలిన ధాన్యం 14076.746 MTs గాను మిల్లు లో కేవలం 3563.760 MTs మాత్రమే ఉండడంతో డిఫాల్ట్ ధాన్యం పై FIR నెంబర్ :163/2024 వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది తెలిపారు. ప్రస్తుతం హై కోర్ట్ తెలంగాణ ఆదేశాల ప్రకారం 10310.091 MTs వడ్ల బకాయిలకు రూ.31 కోట్లు ప్రభుత్వానికి చెల్లించ కుండా తప్పించు కుంటున్నారనే నేపథ్యంలో సంబంధిత మిల్లుకు పలుమార్లు నోటీసులు జారీ చేసి బకాయిలు చెల్లించవలసిందిగా కోరినప్పటికీ సంబంధిత రైస్ మిల్లు యజమానులు బకాయిలు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి చేశారు . ఆర్టిపిటిషన్ను విచారించిన హైకోర్టు సంబంధిత మిల్లర్ కు అనుకూలంగా ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు అయినప్పటికీ కోర్టు కేసు కోర్టులో ఉందన్న ధీమాతో ఒకవేళ చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. రైస్ మిల్లుల పెండింగ్ బకాయిల పై పలు రాష్ట్రస్థాయి సమావేశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రులు ఆదేశించి నప్పటికీ సంబంధిత రైస్ మిల్లర్లు కాలయాపన చేస్తున్నారని అందువలన రైస్ మిల్లర్లపై రెవెన్యూ రికవరీ చట్టం అమలు చేయ వలసిందిగా సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం స్థానిక తాసిల్దార్ మిల్లును సందర్శించి ఆయా శాఖల జిల్లా అధికారుల సమక్షంలో రెవిన్యూ రికవరీ చట్టం కింద పంచనామా నిర్వహించి, మిల్లులో ఉన్న 6.6 కోట్ల చరాస్తులను జప్తు చేసినట్లు తెలిపారు.