- తెలంగాణలో కాంగ్రెస్ ఇంఛార్జి మారారన్న మహేశ్వర్ రెడ్డి
- ఇక మారేది ముఖ్యమంత్రేనని వ్యాఖ్య
- డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని జోస్యం
ముద్ర డెస్క్: తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి మారారని, ఇక మారేది ముఖ్యమంత్రేనని వ్యాఖ్యానించారు. పార్టీ ఇంఛార్జిగా రాహుల్ గాంధీ టీమ్ నుండి పెట్టినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి మార్పు మిషన్ను మీనాక్షి నటరాజన్కు అప్పగించినట్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మార్పు కోసం ఆమె కిందిస్థాయి నుండి సిద్ధం చేస్తున్నారని తెలిపారు. రాబోయే డిసెంబర్లో ముఖ్యమంత్రి మార్పు ఖాయమని జోస్యం చెప్పారు.
ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే తాను మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి ఇటీవల వనపర్తి సభలో అన్నారని, కానీ ఆయనకు ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే ఢిల్లీ నుండి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదం అవసరమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాడి తప్పిందని, మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందని ఆయన అన్నారు. ఏ మంత్రి కూడా ముఖ్యమంత్రిని ఖాతరు చేయడం లేదని విమర్శించారు.