కనకమామిడి గ్రామానికి ఆధ్యాత్మిక శోభ
ముద్ర, మొయినాబాద్: కనకమామిడి గ్రామంలో నెలకొని ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీ సద్గురు వారణాసి రామయ్య ప్రభువుల 83వ వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. సోమవారం ఉదయం ఐదు గంటలకు వారణాసి రామయ్య ప్రభువు విగ్రహానికి, దత్తాత్రేయ స్వామికి అభిషేకంతో ప్రారంభమైన ఉత్సవాలు బుధవారం వరకు జరుగుతాయి.
అనేక గ్రామాల నుంచి వస్తున్న భజన బృందాలు తమ భజనలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అనేక మఠాలు, పీఠాల అధిపతులు గురువులు విచ్చేసి వివిధ అంశాలపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శ్రీ వారణాసి రామయ్య ప్రభు మఠము ట్రస్ట్ అధ్యక్షులు కొండ లక్ష్మీకాంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాలంటీర్లు చక్కటి ఏర్పాటు చేశారు.