Take a fresh look at your lifestyle.

బాలాపూర్ లో రోహింగ్యాలు చట్టబద్ధతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్‌ బాలాపూర్‌లో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘ధర్మ రక్షా సభకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ నెల 24న జరగనున్న ఈ సభకు అనుమతి నిరాకరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుబట్టింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్న సాకుతో పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని.. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని గణేశ్‌ ఉత్సవ సమితి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది.పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది ఎల్‌.రవిచందర్‌ తన వాదనలను వినిపిస్తూ.. బాలాపూర్‌ ప్రాంతంలో తిష్టవేసిన రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను వెంటనే వెనక్కి పంపాలనే ప్రధాన డిమాండ్‌తో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీనే దరఖాస్తు చేసుకున్నా.. పోలీసులు కావాలనే జాప్యం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తూ.. బాలాపూర్ మతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతమని అక్కడ 26 క్యాంపుల్లో సుమారు 6,993 మంది రోహింగ్యాలు నివసిస్తున్నారని పేర్కొంది. వారి నివాసాల వద్దే సభ నిర్వహించడం ఉద్రిక్తతలకు దారితీస్తుందని హోంశాఖ తరఫు న్యాయవాది వాదించారు.
ఈ క్రమంలో ధర్మాసనం ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించింది. అక్కడ ఉంటున్న రోహింగ్యాల చట్టబద్ధమైన హోదా ఏమిటని కోర్టు ప్రశ్నించగా.. వారికి శరణార్థి హోదా లేదని, వారు అక్రమ వలసదారులేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది అంగీకరించారు. అయితే కేంద్ర హోంశాఖ వారి వివరాలను నమోదు చేసి గుర్తింపు కార్డులు మంజూరు చేసిందని వివరించారు. అక్రమ వలసదారుల అంశంపై నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉంటుందని అభిప్రాయపడుతూ కోర్టు సభకు అనుమతినిచ్చింది. సభకు అనుమతినిస్తూనే, శాంతిభద్రతల దృష్ట్యా హైకోర్టు కొన్ని కఠినమైన షరతులను విధించింది. సభను మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే నిర్వహించాలన్నారు. సభకు హాజరయ్యే వారి సంఖ్య 3 వేలకు మించకూడదని.. ఇతర మతాలను కించపరిచేలా గానీ, సమాజంలో ఉద్రిక్తతలు పెంచేలా గానీ ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదన్నారు. సభలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవ సమితి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో గత కొన్ని రోజులుగా బాలాపూర్ సభపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. దేశ భద్రత, అక్రమ వలసల అంశంపై జరగనున్న ఈ సభ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

Leave A Reply

Your email address will not be published.