- స్వల్ప ఊరట ఇచ్చిన సుప్రీంకోర్టు.
- పాస్పోర్టు ఇవ్వాలని ఆదేశం.
- పాస్పోర్టు వచ్చిన మూడురోజుల్లో భారత్ రావాలన్న కోర్టు.
- విచారణకు సహకరించాలని ఆదేశం.
- కఠిన చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి ఆదేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోసం సుప్రీం కోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిగింది. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రభాకర్ రావుకు తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఇండియా వచ్చేందుకు పాస్ పోర్ట్ను కూడా మంజూరు చేసింది. మూడు రోజుల్లో ఇండియా రావాలని ఆదేశాలు జారీ చేసింది. అదే క్రమంలో విచారణకు సహకరించాలని ధర్మాసనం ప్రభాకర్ రావును ఆదేశించింది. మూడు రోజుల్లో ఇండియా వచ్చి దర్యాప్తునకు సహకరిస్తా అని వెంటనే అండర్ టేకింగ్ ఇవ్వాలని జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం ఆదేశించింది.ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ అంశంపై తదుపరి విచారణ చేపడతామని సుప్రీంకోర్టు వెల్లడించింది.ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ గతంలోనే తెలంగాణ కోర్టులో ప్రభాకర్ రావు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే ఇండియాకు తిరిగి వస్తానని పిటిషన్లో పేర్కొన్నారు. దానిపై విచారణ జరిపిన కోర్టు.. ప్రభాకర్ రావుకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ క్రమంలో మే 9న హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు ప్రభాకర్ రావు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే భారత్కు తిరిగి వస్తానని పిటిషన్లో వెల్లడించారు. ఈ పిటిషన్పై విచారించిన సుప్రీం ధర్మాసనం.. ప్రభాకర్ రావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో పాటు వెంటనే ఇండియాకు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీ చేసింది.