జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన: ఈప్ప పువ్వు సారా తయారీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ తయారయ్యే ఉత్పత్తులను దేశ విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని వివరించారు. గిరిజనులకు మెరుగైన ఉపాధి లభిస్తుందని అన్నారు. బ్రిటిష్ కాలంలో విధించిన పాత నిబంధనలను పక్కన పెట్టి, ఆధునిక పద్ధతుల్లో ఇప్ప ఉత్పత్తులను ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం ఆయన మాట్టాడారు. ఇప్ప చెట్టుకు 5వేల ఏండ్ల చరిత్ర ఉందన్న ఆయన దాని ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఇప్ప పువ్వు వినియోగం, దాని ద్వారా గిరిజనులకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్ లిక్కర్ తో ప్రజల ఆరోగ్యం పాడవుతోందన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని తాండాల ప్రజలు గతంలో ఇప్ప పూల సారా తాగి వంద ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించారని ఆయన గుర్తు చేశారు. ఇప్ప పువ్వును టీలో కలిపి తీసుకోవడంతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుందని ఆయన వెల్లడించారు.