తిరుమలలో భక్తులకు శుభవార్త: సెల్కాన్ గ్రూప్ ‘సింహ నిలయం’ అతిథి గృహం ప్రారంభం
తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కొండపై వసతి సౌకర్యాలను విస్తరించే దిశగా మరో కొత్త అతిథి గృహాన్ని ప్రారంభించింది. సెల్కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ‘సింహ నిలయం’ గెస్ట్హౌస్ను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించారు.
అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరాల ప్రకారం, నూతన కాటేజీ డొనేషన్ పాలసీ ద్వారా దాతల సహకారంతో తిరుమలలో అతిథి గృహాల నిర్మాణం కొనసాగుతోంది. ఈ పథకం కింద మొత్తం 24 గెస్ట్హౌస్లకు అనుమతి ఇవ్వగా, ఇప్పటివరకు 16 గృహాలు పూర్తి చేసి టీటీడీకి అప్పగించారు. దీంతో దాదాపు 200 గదులు భక్తులకు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.
తాజాగా ప్రారంభమైన ‘సింహ నిలయం’ అతిథి గృహం అదనపు ఈవో కార్యాలయం సమీపంలో నిర్మించబడింది. తిరుమలకి వచ్చే యాత్రికులకు ఈ గెస్ట్హౌస్లో గదులు కేటాయించనున్నారు.
ఇక భక్తుల కోసం వసతి సౌకర్యాలను మెరుగుపరచే చర్యల్లో భాగంగా, యాత్రికుల వసతి సముదాయం-1ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భవిష్యత్తులో అన్ని వర్గాల భక్తులకు మరింత మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు టీటీడీ కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.