Take a fresh look at your lifestyle.

గడువులోగా పరిష్కరించండి

  • భూభారతి దరఖాస్తులపై రెవెన్యూ అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాలు.

ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి: భూభారతి దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరం నుండి భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, నజరి నక్షా తయారి, బిఎల్ఓలకు శిక్షణ నిర్వాహణ పై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో 1200 ఓటర్ల కంటే ఎక్కువగా ఉంటే అదనపు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కొత్త పోలింగ్ స్టేషన్లలకు బీఎల్ఓలను నియమించాలని సూచించారు.
ఎన్నికలకు సంబంధించిన అన్ని శిక్షణా కార్యక్రమాలను ఈ నెల 3వ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించాలని, అందుకు మాస్టర్ ట్రైనర్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు జిల్లాలోని జీహెచ్ఎంసీ పరిధిలో నజరీనక్షాకు సంబంధించి ఆయా పోలింగ్ స్టేషన్ల సరిహద్దుల్లోకి వచ్చే అన్ని కుటుంబాలు, ప్రతి ఇంట్లోని ఓటర్ల సంఖ్య సమగ్ర సర్వే చేపట్టాలని ఆదేశించారు. ఉన్న ఇంటి నెంబరు ఓటరు లిస్టులో ఉన్న ఇంటి నెంబరు సరి చూసుకోవాలి అని అన్నారు.భూ భారతి చట్టం అమలులో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో వచ్చిన 22,096 దరఖాస్తులలో 21, 718 ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని, మిగిలిన వాటిని కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుల నమోదులో సాంకేతిక లోపాలు ఉంటే తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని అన్నారు. జిల్లాలో వచ్చిన దరఖాస్తులన్నింటిని ఈ నెల 10వ తేదీ వరకు పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్ ను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఆర్ఓ సంగీత, కలెక్టరేట్ సూపరిటెండెంట్లు, ఆర్డీఓలు, తహసీల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.