మోత్కూర్ ముద్ర న్యూస్:
మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో ప్రమాదకర మూల మలుపు వద్ద మరోసారి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఈ మలుపు వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గురువారం రాత్రి సుమారు 8.00 గంటల సమయంలో మోత్కూరు నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు పాటిమట్ల గ్రామంలోని మూల మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది. కారు ఓవర్ స్పీడ్లో ఉండటమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉండగా, అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్లు తెలుస్తోంది. ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదకర మూల మలుపు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, స్పీడ్ బ్రేకర్లు వేయాలని, రహదారి విస్తరణ చేపట్టాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత శాఖలు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
