- 250 బోనాలతో శోభాయాత్ర.
- బోనమెత్తిన మంత్రి వివేక్ వెంకటస్వామి.
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ ఆలయం వద్ద నిర్వహించే బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసి పోయింది. ముందుగా సమీపంలోని చెట్టు వద్ద నుంచి 250 బోనాలతో శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కాగా కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి నెత్తిన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ప్రాంత ప్రజలందరిపై మైసమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని మేకలు,కోళ్లతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమీపంలోని వనంలో వన భోజనాలు చేశారు. కాగా జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ నేతృత్వంలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన పోలీస్, ఫారెస్ట్, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి ఆలయ కమిటీ అధ్యక్షుడు జక్కుల సమ్మయ్య, గౌరవాధ్యక్షుడు పారిపెల్లి తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
