Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం వెంటనే నిర్వహించాలి :   టిఆర్ఎస్ కౌన్సిలర్ల డిమాండ్‌

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భువనగిరి మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం కొలువుదీరి 45 రోజులు గడుస్తున్నా, ఇప్పటి వరకు ఒక్క కౌన్సిల్‌ సమావేశం కూడా ఏర్పాటు చేయకపోవడంపై పలువురు వార్డు సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏవో అంజిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. గత ఫిబ్రవరి 16వ తేదీన మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏర్పాటైనప్పటికీ, ఇంతవరకు సమావేశం జరగకపోవడంతో వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలు చర్చకు రావడం లేదని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ, రహదారులు, వీధి దీపాలు వంటి కనీస మౌలిక వసతుల పనులు చేపట్టాలంటే కౌన్సిల్‌ ఆమోదం తప్పనిసరని, సమావేశం నిర్వహించకపోవడం వల్ల పనులన్నీ నిలిచిపోయాయని వినతి పత్రంలో పేర్కొన్నారు.  రాష్ట్రంలోని ఇతర మున్సిపాలిటీల్లో ఇప్పటికే కౌన్సిల్‌ సమావేశాలు మొదలయ్యాయని, భువనగిరిలో మాత్రం అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) నుంచి అనుమతులు రాలేదనే నెపంతో జాప్యం చేయడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కౌన్సిలర్లును నిలదీస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల తాము సమాధానం చెప్పలేకపోతున్నామని వారు తెలిపారు.  వినతి పత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్లు ఏలే భువనేశ్వరి శివ కుమార్, చెన్న స్వాతి మహేష్, చీమల రాజు, నాకోటి నరేష్, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.