- సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బొంతల కళ్యాణ్ చంద్ర.
ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : హిందూ సామ్రాజ్య స్థాపకుడు , హైందవ వీరత్వానికి ప్రతీక , ఓటమీ ఎరుగని ధీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి, సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర కొనియాడారు. చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని గురువారం కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల జెండా ప్రాంగణం వద్ద చిత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి కళ్యాణ్ చంద్ర ఘన నివాళులు అర్పించి మాట్లాడారు. మొఘల్ సామ్రాజ్య పతనాన్ని శాసించి, హైందవ ధర్మ రక్షణ, స్థాపన కోసం వీరోచిత పోరాటాలు చేసిన ధీరుడు, యోధులు, మహనీయులు చత్రపతి శివాజీ మహారాజ్ అన్నారు.శివాజీ అవలంబించిన యుద్ధ నైపుణ్య వ్యూహాలతో సుదీర్ఘకాలం అనేక యుద్ధాలు చేసి, వందలాది కోటలు తన ఆధీనంలో ఉంచుకొని , లక్షలాదిమందితో సైన్యాన్ని తయారు చేశారని తెలిపారు. కొండలపై సాంకేతిక విలువలతో శత్రు దుర్భేద్యమైన కోటలను నిర్మించడంలో చత్రపతి శివాజీ మహారాజ్ ప్రపంచ ఖ్యాతిని సొంతం చేసుకున్నారన్నారు.