- రాహుల్ గాంధీ వెంట నడువాలి
- మధ్యప్రదేశ్లో సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదని, బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో జాతీయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ముందుగా ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో పాల్గొని సీఎం మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీతో కలిసి ఈ పోరాటం చేస్తున్నామన్నారు. ఇది ఎన్నికల ర్యాలీ కాదని, ఇది ఒక యుద్ధమంటూ సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ఈ యుద్ధం రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడేవారికి, రాజ్యాంగాన్ని మార్చాలనుకునేవారికి మధ్య జరుగుతోందని, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ ఈ విషయాన్ని ముందుగానే గుర్తించి రాజ్యాంగ పరిరక్షణకు పోరాడుతున్నారన్నారు. ఘజనీ మహమ్మద్ హిందుస్తాన్ ను దోచుకోవడానికి ప్రయత్నించిన తరహాలో, రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. కానీ ఆయన ప్రయత్నం ఫలించడంలేదని ఎద్దేవా చేశారు.
బీజేపీని ఎదుర్కొనేందుకు రాహుల్ పోరాటం
ఆనాడు బ్రిటిషర్ల నుంచి మహాత్మా గాంధీ దేశాన్ని రక్షించినట్లు, భారతీయ జనతాపార్టీ పేరుతో చలామని అవుతున్న బ్రిటిష్ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలబడ్డారని సీఎం తెలిపారు. ఈ యుద్ధంలో మనమంతా రాహుల్ గాంధీతో కలసి నడవాలని, ప్రధానంగా యువతీ యువకులు ముందడుగు వేయాలని సూచించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు మనమంతా కలిసికట్టుగా పోరాడాలని, ఇది రెండు పరివార్ ల మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఒకటి గాంధీ పరివార్.. మరొకటి గాడ్సే పరివార్ అని సీఎం అన్నారు. గాడ్సే పరివార్ వైపు నుంచి మోదీ, గాంధీ పరివార్ వైపు నుంచి రాహుల్ గాంధీ పోరాటం సాగిస్తున్నట్లు చెప్పారు. అందుకే మనమంతా గాంధీ పరివార్ గా రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలని, రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో కులగణన చేశాం : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని, వారికి అండగా ఉంటుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తాము అధికారంలో ఉన్న తెలంగాణలో కులగణన సర్వేను విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. రిజర్వేషన్లలో ఓబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు, ఓబీసీలకు న్యాయం జరిగేలా పోరాడుతామని అన్నారు. ఇండోర్ లో నిర్వహించిన జై బాపు, జై భీం, జై సంవిధాన్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. మోడీ సర్కారుకు వ్యాపారులే ముఖ్యమని విమర్శించారు. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. స్వాతంత్రోద్యమాన్ని అవమానపర్చేలా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు.
అమిత్ షా సాక్షాత్తూ పార్లమెంటులోనే అంబేద్కర్ ను అవమాన పర్చారని అన్నారు. దేశంలో 90% మందికి చట్టసభల్లో ప్రాతినిధ్యం దక్కడం లేదని, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని రాహుల్ గాంధీ చెప్పారు. రిజర్వేషన్లలో ముఖ్యంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని అన్నారు. మోదీ ప్రభుత్వం దేశంలోని విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని ఆరోపించారు. జీఎస్టీ పేరుతో ప్రజలను లూఠీ చేస్తోందని అన్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన వెంటనే కుల గణన చేపడ్తామని రాహుల్ ప్రకటించారు. తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ లో విప్లవాత్మకంగా మేము కుల గణన ప్రక్రియ ను మొదలు పెట్టామని, తెలంగాణ లో దళితుల భాగస్వామ్యం ఎంతుంది, వెనుక బడిన జాతుల భాగస్వామ్యం ఎంత… ఆదివాసుల పరిస్థితి ఏముంది… ఎక్కడ ఎవరెవరు ఉన్నారు..అనే సమగ్ర వివరాల కోసం తెలంగాణ లో తాము ఈ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ఇదే పని కర్ణాటక రాష్ట్రంలో కూడా మొదలైందని, ఇది ఒక విప్లవాత్మక నిర్ణయం కాబోతుందన్నారు. ఈ నిర్ణయం వల్ల మన భాగస్వామ్యం ఎంత అనే మాట 90 శాతం ప్రజానీకానికి తెలిసిపోతుందని రాహుల్ చెప్పారు.