- పాత ఇంటి యజమాని పార్వతమ్మ కుటుంబాన్ని కలవనున్న సీఎం
- బాల్య మిత్రులతో భోజనం
- నేడు వనపర్తికి సీఎం రేవంత్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, వనపర్తి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం వనపర్తికి రానున్న తరుణంలో తాను విద్యాభ్యాసం చేసిన వనపర్తి జ్ఞాపకాలను నెమరు వేసుకో నున్నారు.మొదట పాలిటెక్నిక్ కళాశాల వెనుక భాగంలోని మైదానంలో ఎలిప్యాడ్ దిగిన అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.అక్కడి నుండి తాను విద్యాభ్యాసం చేసే సందర్భంలో అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలు పార్వతమ్మ కుటుంబాన్ని కలిసి ముచ్చటించనున్నారు. అక్కడ తన జ్ఞాపకాలను ఆ కుటుంబంతో పంచుకున్న అనంతరం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తనతోపాటు విద్యాభ్యాసం చేసిన మిత్రులు ఇతర స్నేహితులు వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి వారితో పాటు ముఖ్యమంత్రి భోజనం చేయనున్నారు.అనంతరం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన బహిరంగ సమావేశంలో పాల్గొని హైదరాబాద్ కు బయలుదేరనున్నారు.
- మాది అక్కాతమ్ముళ్ల బంధం: పార్వతమ్మ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రెండవ తరగతి నుండి 12వ తరగతి వరకు తన ఇంట్లోనే ఉండి విద్యాభ్యాసం చేయడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని ఇంటి యజమాని పార్వతమ్మ తెలిపారు.తన ఇంట్లో అద్దెకు ఉన్న ఏనాడు ఇతర కుటుంబ సభ్యునిగా తాను చూడలేదని,తన సొంత తమ్మునిగా చూసుకున్నానని ఆమె అన్నారు. మా ఇంట్లో ఉండి చదివిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాక కూడా మా కుటుంబాన్ని గుర్తించుకొని వనపర్తికి వచ్చిన సందర్భంగా మా ఇంటికి రావడం ఎంతో ఆనందకరంగా ఉందని కళ్ళలో నీళ్లు నింపుకొని పార్వతమ్మ అన్నారు.ఎంత ఎత్తుకు ఎదిగిన మా తమ్ముడు పాత జ్ఞాపకాలను మరువలేదని ఆమె అన్నారు.చిన్నప్పటి నుండి కూడా పట్టుదల గల వ్యక్తి అని,తాను అనుకున్న పని ఎంత కష్టమైనదైనా ఇష్టంగా చేసేవాడని ఆమె అన్నారు.ముఖ్యమంత్రి మా ఇంటికి వచ్చిన రోజు శుభ దినమని,పండుగ రోజు అని ఆమె అన్నారు.నా జన్మకు ఇది చాలు అని అన్నారు.
- ముఖ్యమంత్రితో భోజనం చేయడం అదృష్టం : స్నేహితులు
ముఖ్యమంత్రి అయ్యాక ఎనుముల రేవంత్ రెడ్డి వనపర్తి కి వచ్చిన సందర్భంగా తమతో కలిసి భోజనం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నామని బాల్యమిత్రులు అన్నారు.వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనల్లో భాగంగా ఆదివారం వనపర్తికి రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మిత్రుల బృందాన్ని కలిసి వారితో ముచ్చటించి అనంతరం విందు ఆరగించనున్నారు.విషయం తెలిసిన నాటినుండి మిత్రులందరు.ఆనందంలో మునిగి తేలుతున్నారు.