కాంట్రవర్సీ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయాలి. .డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్..
శాసనసభలో సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల వ్యవహరించిన తీరు దారుణం..
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు..
ఇలాంటివారు అసెంబ్లీలో ఉండకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి..
రౌడీయిజం గుండాయిజం చెల్లదు..
కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది..
ముద్ర కరీంనగర్ :
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సిరాజు హుస్సేన్ మండిపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన కడియం శ్రీహరి గారి పట్ల కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
సోమవారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీరును నిరసిస్తూ సిరాజు హుస్సేన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి వ్యక్తులు శాసనసభలో ఉండడం ప్రమాదకరమని వెంటనే ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రజల సమస్యలను చర్చించే పవిత్ర వేదిక అయిన అసెంబ్లీలో బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన స్థానంలో ఉండి, ప్రజా ప్రతినిధిగా ప్రవర్తన సరిగా లేకపోవడం బాధాకరమన్నారు. సీనియర్ నేతగా సీనియర్ ఎమ్మెల్యేగా పలుమార్లు మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి పట్ల హవ భావాలు చేస్తూ కించపరచడం సరైనది కాదన్నారు. ఆయనకు వెంటనే బేషరతుగా కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి కాంట్రవర్సీ చేయడం కౌశిక్ రెడ్డికి అలవాటుగా మారిందని పత్రికల్లో హైలెట్ కావడం రివాజ్ గా మారిందన్నారు. గతంలో గవర్నర్గా పనిచేసిన తమిళసై గారి పట్ల చులకనగా మాట్లాడడం ఎవరిని లెక్క చేయకపోవడం ఇటీవల సిపి గౌష్ ఆలం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి నాయకుడు నైతిక విలువలను పాటిస్తూ, ప్రజలకు ఆదర్శంగా నిలవాలన్నారు. కానీ ఇటువంటి ఘటనలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉంటాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా చర్చించాలనే బాధ్యతను గుర్తుంచుకోవాలని కౌశిక్ రెడ్డికి సూచించారు.ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని రాష్ట్రమంతా వ్యతిరేకిస్తున్నారని ప్రజలంతా తగిన గుణపాఠం చెబుతారని సిరాజు హుస్సేన్ పేర్కొన్నారు.