ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి;
ఐక్యతతోనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. జిల్లా కేంద్రంలో జే ఫంక్షన్ హాల్లో మాదిగల ఓట్లు మాదిగలకే అనే నినాదంతో మాదిగ మహాశక్తి నాయకులు సగరపు ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా కానీ మాదిగల బతుకులు మారడం లేదని రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు ఉంటే అగ్రకులాలైన రెడ్లు, కమ్మలు వెలమలు, అధికారాన్ని చలాయిస్తూ మాదిగలను, బహుజన కులాలను పావులుగా, ఓట్లు వేసే యంత్రాలుగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగల ఓట్లు మాదిగలకే వేసుకుంటే మన సత్తా ఏందో తెలుస్తదని ఓటుకి ఎంత బలం ఉందో అగ్రకులాల కు వణుకు పుడుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 50 వేలకు మంది పైగా మాదిగలు ఉన్నారని మన ఓట్లు మనమే వేసుకుంటే బీసీల సహకారంతో మాదిగలు రాజ్యాధికారాన్ని ఏర్పాటు చేయవచ్చని అన్నారు. మాదిగల మహాశక్తి జండా ఎగరాలని రిజర్వేషన్లు ఉన్న ఫలాలు అందటంలో పాలకులు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మాల కుటుంబాలకే, సీట్లు మంత్రి పదవులు దక్కాయని ఆక్షేపించారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, ప్రొఫెసర్ కనకయ్య, దుర్గయ్య గౌడ్, బండారు సుధాకర్, కేవీ, మాచర్ల సైదులు, డేవిడ్, మస్తాన్, దయానందo, జయశంకర్, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.