Take a fresh look at your lifestyle.

గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం: ఎస్పీ నరసింహ

 
డ్రగ్స్, సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి – అవగాహన కల్పన కార్యక్రమం

ముద్ర, చివ్వెంల (సూర్యాపేట జిల్లా), ఏప్రిల్ 2:
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో గురువారం గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ నరసింహ (ఐపీఎస్) హాజరయ్యారు.

ముందుగా గ్రామ పరిపాలన అధికారులు గ్రామ అభివృద్ధి, చరిత్ర, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, లబ్ధిదారుల వివరాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని గ్రామస్తులకు సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన కరపత్రాలను గ్రామస్తులు, విద్యార్థులు, యువతకు పంపిణీ చేశారు.

ఎస్పీ నరసింహ మాట్లాడుతూ…
గ్రామసభలు గ్రామాభివృద్ధికి దిశానిర్దేశం చేసే వేదికలని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం పనిచేస్తున్నారని, మంచి వారికి మిత్రులుగా, చెడు ప్రవర్తన కలిగిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు పెట్టుకోకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. “పోలీసు ప్రజా భరోసా” కార్యక్రమం ద్వారా ఇప్పటికే జిల్లాలో 300కు పైగా గ్రామాల్లో అవగాహన కల్పించామని తెలిపారు.

సామాజిక సమస్యలపై హెచ్చరిక
ప్రస్తుత సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ వినియోగం, సైబర్ మోసాలు అని ఎస్పీ పేర్కొన్నారు.

  • మద్యం సేవించి వాహనాలు నడపకూడదని
  • చిన్నారులకు వాహనాలు ఇవ్వవద్దని
  • సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు

డ్రగ్స్ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని, గంజాయి రహిత గ్రామాల కోసం ప్రజలు పోలీసులతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనుమానాస్పద సమాచారం ఉంటే డయల్ 100 లేదా 1908కు తెలియజేయాలని సూచించారు.

మహిళలు, పిల్లల భద్రతపై దృష్టి
మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు పోలీసులు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. షీ టీమ్స్, పోలీస్ భరోసా కేంద్రాల ద్వారా రక్షణ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇతర సూచనలు
తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని, వృద్ధాప్యంలో వారిని పోషించడం పిల్లల బాధ్యత అని పేర్కొన్నారు. గ్రామాల్లో సామాజిక భద్రతపై అవగాహన పెంపొందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్సై మహేష్, సర్పంచ్ నగేష్, ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, గ్రామ అధికారులు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.