Take a fresh look at your lifestyle.

నాకూ ప్లేస్ ఇవ్వండి.. నేనూ ఆడతా..!

  • విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడిన మంత్రి పొంగులేటి.
  • ఆట అనంతరం కాసేపు ఆటగాళ్లతో మాట మంతి.
  • డ్రగ్స్ కు బానిసలవ్వొద్దని, బాగా చదవాలని హితవు.

పాలేరు, ముద్ర విలేకరి: ఏరా పిల్లలు.. వాలీబాల్ ఆడుతున్నట్టున్నారు.. నాకూ ప్లేస్ ఇవ్వండి.. నేనూ ఆడతానంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాలీబాల్ ఆడుతున్న విద్యార్థులను పలకరించారు. ఆ తర్వాత వారితో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. బుధవారం కూసుమంచి మండల పర్యటనలో భాగంగా గైగోల్లపల్లి గ్రామానికి వెళ్ళి తిరుగు వస్తుండగా నర్సింహులగూడెం గ్రామంలోని మైదానంలో వాలీబాల్ ఆడుతూ కనిపించిన విద్యార్థులను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. నేనూ ఆడతా నాకూ ప్లేస్ ఇవ్వండంటూ కాసేపు వారితో కలిసి వాలీబాల్ ఆడారు.ఆట అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.ఒక్కొక్క విద్యార్థిని పలకరించి ఏం చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు.పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కూసుమంచిలో మంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని.. నాణ్యమైన విద్యను అందిస్తామని దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చదువుకోవాలని సూచించారు. డ్రగ్స్ కు యువత బానిస అవ్వొద్దని విక్రయాలు జరిపే వారి వివరాలు తెలిసినా డ్రగ్స్ కు బానిసైన వారు ఎవరైనా తన దృష్టికి తీసుకుని రావాలని కోరారు. చదువుతో పాటు ఆట కూడా ముఖ్యమని చెప్పి కొత్త వాలీబాల్, క్రికెట్ కిట్ కొనుక్కోమని వారికి నగదును టీమ్ సభ్యులకు అందించారు.స్వయంగా మంత్రే వచ్చి వారితో వాలీబాల్ ఆడటంతో అక్కడి విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Leave A Reply

Your email address will not be published.